ఉపోద్ఘాతము:

పేరు:   యోహాను సువార్త గ్రంథానికి రాసిన వివరణను  చూడండి. యోహాను 2, 3 లేఖల ఆరంభంలో తన్ను తాను ”పెద్దగా” సంబోధించుకుంటాడు యోహాను. అపోస్తలుల కార్యములు గ్రంథంలో పేతురుతో కలసి అద్భుతాలు చేశాడు (అ.కా. 3:3; 4:1). యెరుషలేం సంఘ  పెద్ద  (అ.కా. 8:14). 

కాలము:   క్రీ.శ. 95-96లో పత్మోసు దివి బహిష్కరణ నుండి తిరిగి వచ్చిన తరువాత, ఎఫేసు నందు

రచయిత :  యోహాను.

చారిత్రక నేపథ్యము: క్రీస్తుకు ప్రత్యక్ష సాక్షిగా నున్న ఇతను అధికార పూర్వకంగా నూతన ప్రజకు క్రీస్తు అభయం, దేవుని అనుగ్రహమును వివరించాడు. క్రీస్తు ప్రభువు మీద చెలరేగిన అపోహలు, అపవాదాలను త్రిప్పికొట్టడానికి ఈ లేఖను రాశాడు.

ముఖ్యాంశములు: దేవుని కృప, క్రీస్తు అనుగ్రహం చేత నూతన జన్మ పొందిన వారినుద్దేశించి రాశాడు. అట్టివారు దేవుని బిడ్డలు (2:1, 12, 13, 18, 28; 3:7; 4:4; 5:21). వీరు దేవుని గృహంలో నివసిస్తారు. వారు సత్యానికి తగ్గట్టుగా జీవిస్తారు. తప్పు, పాపం చేసిన వారు ఒప్పుకొని క్షమాపణ పొందాలి (1:8-2:2). దేవుని ఆజ్ఞలు శిరసా వహించాలి (2:3-7). అన్యోన్య ప్రేమను వ్యక్తపరచు కోవాలి (3:11-18).

క్రీస్తు చిత్రీకరణ: క్రీస్తు శరీరధారిగా మన నిమిత్తం రక్తం ధారపోశాడు (1:7). ఈ లేఖలో క్రీస్తుని జీవం (1:1, 2; 2:25; 3:15; 5:11, 12, 13, 20), వెలుగు (1:5, 7; 2:8-10), ప్రేమ (3:11-18; 4:7-12) ప్రదాతగా చూస్తాం.