బబులోనియా పతనము

18 1. అటుపిమ్మట దివినుండి మరియొక దేవదూత వెడలుట కనుగొంటిని. అతని అధికారము చాలగొప్పది. ఆయన భువినంతిని తన వైభవముచే ప్రకాశింపజేసెను.

2. ఆయన బిగ్గరగా ఇట్లు  పలికెను:  ”ఆమె నశించెను! బబులోనియా మహానగరము పతనమయ్యెను! ఆమె ఇప్పుడు దయ్యములకును, కలుషాత్ములకును నిలయమైనది. అసహ్యకరములును, జుగుప్సాకరములునైన అన్ని రకముల పక్షులు ఇప్పుడు అట నివసించును.

3. ఏలయన, ఆమె తన మద్యమును ప్రజలకు అందరకును పంచిపెట్టి వారిచేత త్రాగించెను. ఆ మద్యము అనునది ఆమె వ్యభిచార వ్యామోహమే. భువియందలి రాజులు ఆమెతో వ్యభిచరించిరి. లౌకిక వర్తకులు ఆమె విపరీత వ్యామోహము వలన భాగ్యవంతులైరి” అని అతడు వచించెను.

4. అంతట దివినుండి నేను మరియొక కంఠధ్వని ఇట్లు పలుకుట వింటిని:

               ”నా ప్రజలారా! బయటకురండు!

               దానినుండి బయటపడుడు!

               ఆమె పాపములో మీరు

               భాగస్వాములు కారాదు!

               ఆమె శిక్షలలో మీరు

               పాలుపంచుకొనరాదు.

5.           ఏలయన, ఆమె పాపములు

               ఆకాశమును అంటుచున్నవి.

               ఆమె దుష్టప్రవర్తనలు

               దేవునకు జ్ఞాపకము ఉన్నవి.

6.           ఆమె మిమ్మెట్లు చూచెనో మీరును

               ఆమెనట్లే చూడుడు. ఆమె ఒనర్చినదానికి

రెట్టింపు ప్రతిఫలమిండు.

               మీకు ఆమె ఎట్టి పానీయమును ఒసగెనో,

               ఆమె పానపాత్రను దానికి రెట్టింపు

               ఘాటైన పానీయముతో నింపుడు.

7.            ఆమె తనకు ఎట్టి వైభవమును

               సౌఖ్యమును కూర్చుకొన్నదో

               దానికి తగినంత బాధను, దుఃఖమును

               ఆమెకు కలిగింపుడు.

               ‘నేను ఇట రాణిని! నేను వితంతువును కాను.

               దుఃఖమును నేను ఎన్నటికిని

               ఎరుగకుందును’ అని

               ఆమె తనకు తాను చెప్పు కొనుచుండునుగదా!

8.           కనుకనే వ్యాధి, దుఃఖము,

               కరువు అను ఆమె రోగములన్నియు

               ఒక్క దినముననే ఆమెను పీడించును.

               ఆమె అగ్నిచే దగ్ధమగును.

               ఏలయన, ఆమెకు తీర్పుతీర్చు ప్రభువు,

               దేవుడు, మహాబలవంతుడు”.

9. ఆ నగరము దగ్ధమై పొగ వెలువడుట చూచి ఆమెతో వ్యభిచరించి భోగములనుభవించిన భూపాలురు విలపించి ప్రలాపింతురు.

10. ఆమె పడు కష్టములకు భయపడి దూరమునుండియే, ”ఎంత దారుణము! ఎంత భయంకరము! ఓ బబులోనియా మహానగరమా! ఎంత దృఢమైనదానవు! కాని ఒక్క గంటలో నీవు తీర్పు తీర్చబడితివిగదా!” అని పలుకుదురు.

11. భువియందలి వర్తకులు ఆమె కొరకై ఆక్రందింతురు, దుఃఖింతురు. ఏలయన, తమ వస్తువులను ఇక ఎవరును కొనరుగదా!

12. వారి బంగారము, వెండి, రత్నములు, ముత్యములను, చిత్రవిచిత్ర వర్ణములుగల పట్టుబట్టలను, చీనాంబరములను, జరీ వస్త్రములను, దంతపు వస్తువులను, అమూల్యములగు కొయ్య వస్తువులను, కంచు, ఇనుము, పాల రాతితో చేసిన వస్తువులను, 13. దాల్చిన చెక్క, సువాసన ద్రవ్యములు, ధూపము, గుగ్గిలము, గంధరసము, సాంబ్రాణి, మద్యము, నూనె, పిండి, గోధుమలు, పశువులు, గొఱ్ఱెలు, గుఱ్ఱములు, బండ్లు, బానిసలను, మనుజుల ప్రాణములను ఇకమీదట ఎవరునుకొనరు.

14. నీవు కావలెనని కోరుకొనుచుండెడి వస్తువులన్నియు అదృశ్యములైనవి. నీ ధనవైభవములు గతించినవి. అవి ఎన్నికిని మరల నీకు లభింపవు!” అని వర్తకులు ఆమెతో పలుకుదురు.

15. ఆ నగరమున వర్తకము చేసి ధనికులైన వ్యాపారులు, ఆమె పడు బాధకు భయపడి దూరముగ ఉందురు. వారు ఏడ్చుచు దుఃఖించుచు, 16. ”ఎంత దారుణము! ఆ మహానగర మునకు ఎట్టి భయానకస్థితి! ఆమె నారవస్త్రములను, చీనాంబరములను, జరీవస్త్రములను ధరించెడిదిగదా! సువర్ణా భరణములతోను, అమూల్యములగు రత్నముల తోను, ముత్యములతోను, తనను అలంకరించు కొనెడిదిగదా!

17. ఈ భాగ్యమంతయు ఒక్క గడియలోనే నశించెనే!” అని వారు పలుకుదురు. నాయకులును, నావికులును, ప్రయాణికులును, సముద్ర జీవనము గడుపువారును, అందరును, దూరముగ నిలిచి ఉండిరి.

18. దగ్ధమైన ఆ నగరమునుండి వెలువడు పొగను చూచి ఆక్రందించుచు ”ఈ మహానగరమునకు సాటియైనది మరియొకటి కలదా!” అని పలికిరి.

19. తమ తలలపై దుమ్ము పోసికొనుచు, ఏడ్చుచు, శోకించుచు, ”అయ్యో ఎంత దారుణము! ఆ నగరమునకు ఎంత భయానక స్థితి! నౌకలుగల వారందరు ఆ నగర సంపద చేతనే ధనికులైరి! కాని ఒక్క గడియలో ఆమె సమస్తమును కోల్పోయెను  గదా!  అని పలవించిరి.

20.  ఓ  దివ్యలోకమా! ఆమె నాశనమునకు ఆనందింపుము. పునీతులారా! అపోస్తలులారా!  ప్రవక్తలారా!  మీరును ఆనందింపుడు. ఆమె మీకు ఒనర్చిన దానికి ప్రతిక్రియగా దేవుడు ఆమెను తీర్పునకు గురిచేసెను” అని కేకలు పెట్టిరి.

21. అంత ఒక బలిష్ఠుడగు  దేవదూత గొప్ప తిరుగి రాతివంటి రాతిని ఎత్తి సముద్రము లోనికి విసరివేయుచు, ”మహానగరమగు బబులోనియా ఇదే విధముగా తీవ్రముగ విసరికొట్టబడి మరల కనబడకుండ పోవును.

22. వాయిద్యకారులయొక్కయు, గాయకులయొక్కయు, వేణువును బాకాను ఊదు వారల ధ్వనులు నీనుండి ఇక ఎన్నడును వినరావు! ఏ వృత్తికి చెందిన పనివాడును నీయందిక ఎన్నటికి కానరాడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడును నీనుండి వినబోము!

23. దీపకాంతి ఇక నీయందు ఎన్నడును చూడబోము! వధూవరుల కంఠ ధ్వనులు ఇక ఏనాడును నీ నుండి వినబడబోవు! నీ వర్తకులు ప్రపంచమునకెల్ల శక్తిమంతులు. కాని నీ మాయాజాలముతో ప్రపంచ ప్రజలనే నీవు మోసగించితివి!” అని  పలుకును.

24. ప్రవక్తలయొక్కయు,  పునీతులయొక్కయు,  భువియందు చంపబడిన అందరియొక్కయు రక్తము ఆ నగరమున ప్రవహించెను.