కుమారుని  ద్వారా దేవుని సందేశము

1 1. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగ ప్రవక్తలద్వారా మన పూర్వులతో మాట్లాడెను.

2. కాని, ఈ కడపటి దినములలో ఆయన తన కుమారునిద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని  మూలముననే  విశ్వమును సృష్టించెను.

3. ఆ కుమారుడు దేవుని మహిమయొక్క తేజస్సుగాను, అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తనవాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తిని చేసినవాడై పిదప పరలోకమున సర్వ శక్తిమంతుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు.

4. ఆ కుమారుడు దేవదూతల కంటె ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటె అంత ఘనుడు.

యేసుక్రీస్తు దేవుని కుమారుడు

దేవదూతలకంటే అధికుడు

5.           ఎట్లన ”నీవు నా కుమారుడవు,

               నేడు నేను నీ తండ్రినైతిని”

అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండెనా? అట్లే

               ”నేను ఆయన తండ్రినగుదును.

               ఆయన నా కుమారుడగును”

అని దేవుడు ఏ దూతతోనైన చెప్పియుండెనా?

6.           దేవుడు తన ప్రథమ పుత్రుని

               ఈ లోకమునకు పంపినపుడు,

               ”దేవుని దూతలందరు ఆయనను పూజింపవలెను”

అనియు చెప్పుచున్నాడు.

7.            దేవదూతలను గూర్చి దేవుడిట్లు పలికెను:

               ”దేవుడు తన దూతలను వాయువులుగాను,

               తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసికొనెను.”

8.           కాని తన కుమారుని గూర్చి దేవుడు

               ”ఓ దేవా! నీ సింహాసనము నిరంతరమైనది!

               నీతిమంతమైన నీ రాజదండము

               నీ రాజ్య పరమైనది.

9.           నీవు నీతిని ప్రేమించి,

               అక్రమమును ద్వేషించితివి.

               అందువలననే దేవుడు, నీ దేవుడు,

               నిన్ను నీ తోడివారి కంటె మిన్నగా

               ఆనంద తైలముతో అభిషేకించెను.”

అని చెప్పెను.

10.         ”ఆదియందే నీవు భూమికి

               పునాదులు వేసితివి.

               నీ చేతులతోనే ఆకాశమును సృజించితివి.

11.           భూమ్యాకాశములు గతించునుగాని

               నీవు నిలిచియుందువు.

               అవి వస్త్రములవలె పాతబడును.

12.          వానిని నీవు అంగీవలె మడిచివేయుదువు.

               అవి దుస్తులవలె మార్చబడును.

               కాని నీవు ఎల్లవేళల ఏకరీతిగా నుందువు.

               నీ ఆయుష్షునకు అంతము లేదు”

అనియు దేవుడు చెప్పెను.

13.          ”నేను నీ శత్రువులను

               నీకు పాదపీఠముగా చేయువరకు

               నీవు నా కుడిపార్శ్వమున ఆసీనుడవు కమ్ము”

అని దేవుడు తన దూతలలో ఎవ్వరితోనైన ఎన్నడైన పలికి ఉండెనా?

14. అట్లయిన దేవదూతలు ఎవరు? వారందరు దేవుని సేవించుచు రక్షణను పొందనున్న వారి సహాయార్థము దేవునిచే పంపబడు ఆత్మలు కారా?