క్రొత్త దివి, క్రొత్త భువి

21 1. అంతట నేను ఒక క్రొత్త దివిని, క్రొత్త భువిని చూచితిని. మొదటి దివియు, భువియు అదృశ్యమయ్యెను. సముద్రము కూడ అదృశ్యమయ్యెను.

2. అనంతరము దివియందలి దేవునినుండి దిగివచ్చుచున్న పవిత్ర నగరమగు నూతన యెరూషలేమును కాంచితిని. ఆమె తన భర్తను చేరబోవుటకు వస్త్రధారణము ఒనర్చుకొని సిద్ధపడిన వధువువలె ఉండెను.

3. సింహాసనమునుండి ఒక గంభీరధ్వని వెలువడుట నేను వింటిని.”ఇక దేవుడు మానవులతోనే నివసించును! ఇక ఆయన వారితోనే నివసించును! వారే ఆయన ప్రజలు.స్వయముగ దేవుడే వారితో ఉండును. ఆయన వారికి దేవుడగును.

4. వారి నేత్రముల నుండి వెలువడు కన్నీటిని ఆయన తుడిచివేయును. ఇక, మృత్యువుగాని, దుఃఖముగాని, ఏడుపుగాని, బాధగాని, ఏ మాత్రము ఉండబోదు. పాత విషయములు గతించినవి” అని ఆ గంభీర స్వరము పలికెను.

5. అంతట సింహాసనాసీనుడు, ”ఇప్పుడు అన్నిటిని క్రొత్తగా సృష్టించెదను!” అని పలికెను. ”ఇది నిజము. విశ్వసనీయము. కనుక వ్రాతపూర్వకముగా ఉంచుము!” అని ఆయన నాతో చెప్పెను.

6. ఇంకను ఆయన, ”సమాప్తమైనది! ఆల్ఫా, ఓమేగ నేనే. ఆదియును, అంత్యమును నేనే! దాహముగొన్న వ్యక్తిని జీవజలపు ఊటనుండి ఉచితముగా త్రాగనిత్తును.

7. జయమునుపొందు వ్యక్తికి నేనే దేవుడను. అతడు నా పుత్రుడు. ఈ వరమును అతడు నానుండిపొందును. 8. కాని పిరికివారికిని, వక్రబుద్ధులకును, విశ్వాస రహితులకును, హంతలకును, వ్యభిచారులకును, మాంత్రికులకును, విగ్రహారాధకులకును, అసత్య వాదులకును గంధకయుక్తమైన అగ్నిగుండమే తగిన స్థలము. అదియే రెండవ మరణము” అని పలికెను.

నూతన యెరూషలేము

9. అంతిమ సప్తజాడ్యములుగల సప్త పాత్రలను ధరించిన ఏడుగురు దేవదూతలలో ఒకడు నన్ను సమీపించి ”గొఱ్ఱెపిల్లకు భార్యయగు వధువును చూపెదనురమ్ము!” అని పిలిచెను.

10. అంతట ఆత్మ యందు ఆ దేవదూత నన్ను  ఒక  మహోన్నత  పర్వత శిఖరమునకు చేర్చెను. దివియందుండి, దేవునినుండి, దివ్య వైభవముతో వెలుగొందుచు, దిగివచ్చుచున్న పవిత్రనగరమగు యెరూషలేమును నాకు అతడు చూపెను.

11. ఒక అమూల్య రత్నమువలెను, సూర్యకాంతమణివలెను, స్ఫటికమువలెను, స్వచ్ఛముగను ఆ నగరము ప్రకాశించెను.

12. ఆ నగరము చుట్టు ఒక మహోన్నతమగు గోడ ఉండెను. ఆ గోడకు పండ్రెండు ద్వారములు ఉండెను. ఆ పండ్రెండు ద్వారములును పండ్రెండు మంది దేవదూతల నిర్వహణలో ఉండెను. ఆ పండ్రెండు ద్వారములపై యిస్రాయేలు ప్రజల పండ్రెండు గోత్రములపేర్లును వ్రాయబడి ఉండెను.

13. తూర్పున మూడు, దక్షిణమున మూడు, ఉత్తరమున మూడు, పశ్చిమమున మూడు ద్వారము లుండెను.

14. ఆ నగరపు గోడ పండ్రెండు పునాదులపై నిర్మింపబడెను. వాటిపై గొఱ్ఱెపిల్లయొక్క పండ్రెండు అపోస్తలుల నామములు లిఖింపబడి ఉండెను.

15. నాతో మ్లాడిన దేవదూతవద్ద, నగరమును, నగరద్వారములను, దానిగోడలను, కొలుచుటకు ఒక బంగారపు కొలబద్ద ఉండెను.

16. ఆ నగరము పొడవు, వెడల్పులు సమానముగా ఉండి సమచతురస్రమై ఉండెను. ఆ దేవదూత నగరమును తన కొలబద్దతో కొలిచెను. అది పదిహేను వందల మైళ్ల పొడవును, అంతే వెడల్పు, అంతే ఎత్తుగలదై ఉండెను. 17. ఆ దేవదూత నగరపు గోడను గూడ కొలిచెను. అది మనుష్యుని కొలత చొప్పున నూట నలువది నాలుగు మూరలైనది. ఆ కొలత దూతకొలతయే.

18. గోడ సూర్యకాంతమణులతో పొదగబడినది. నగరము స్వచ్ఛమగు బంగారముతో కట్టబడెను. గాజువలె నిర్మలమైయుండెను.

19. ఆ నగర ప్రాకారపు గోడ పునాదిరాళ్ళు అమూల్యములగు రత్నాదులచే అలంకరింపబడి ఉండెను. మొదటి పునాది రాయి సూర్యకాంతమణి. రెండవది నీలమణి. మూడవదిరత్నము. నాలుగవది మరకతము.

20. ఐదవది గోమేధికము. ఆరవది కెంపు. ఏడవది చంద్రకాంత మణి, ఎనిమిదవది గరుడపచ్చ, తొమ్మిదవది పుష్యరాగము. పదియవది వైడూర్యము, పదునొకండవది పద్మరాగము. పండ్రెండవది ఊదామణి.

21.పండ్రెండు ద్వారములును పండ్రెండుముత్యములు. ఒక్కొక్క ద్వారమును ఒక్కొక్క ముత్యముచే చేయబడి యుండెను. ఆ నగర వీధులు సువర్ణమయమై గాజువలె పారదర్శకముగ ఉండెను.

22.  ఆ  నగరమున  ఎచటనను  నాకు దేవాలయము గోచరింపలేదు. ఆ నగరమునకు సర్వశక్తిమంతుడైన దేవుడగు ప్రభువును, గొఱ్ఱెపిల్లయును దేవాలయము గదా!

23. ఆ నగరమునకు సూర్యచంద్రుల వెలుగే అవసరము లేకుండెను. దేవుని తేజస్సు ఆ నగరమును  దేదీప్యమానముగ చేయును. గొఱ్ఱెపిల్లయే ఆ  నగరమునకు దీపము.

24. ప్రపంచ ప్రజలు దాని వెలుగుచే నడువగలుగుదురు. భూపాలురు తమ వైభవమును దానిలోనికి తీసుకొని వత్తురు.

25. ఆ నగర ద్వారములు దినమంతయు తెరువబడియే ఉండును. అటరాత్రి అనునది ఉండదు. కనుక ఆ ద్వారములు ఎన్నడును మూయబడవు.

26. పెక్కు జాతుల ఘనతయు, భాగ్యమును ఆ నగరమునకు కొనిరాబడును.

27. కాని కలుషితమైనది ఏదియు ఆ నగరమున ప్రవేశింపదు. అట్లే దుష్కార్యము లొనర్చినవారు, అసత్యవాదులు అట ప్రవేశింపరు. ఆ గొఱ్ఱెపిల్ల యొక్క జీవగ్రంథమున ఎవరి పేర్లు వ్రాయబడి ఉన్నవో వారు మాత్రమే ఆ నగరమున ప్రవేశింతురు.