రెండు మృగములు

13 1. అంతలో సముద్రమునుండి ఒక క్రూర మృగము వెలుపలికి వచ్చుట గమనించితిని. దానికి పది కొమ్ములు, ఏడుతలలు. అన్ని కొమ్ములకును కిరీటములు ఉండెను. దాని తలలపై ఒక దుష్టనామము వ్రాయబడి ఉండెను. 2. ఆ మృగము ఒక చిరుత పులివలె ఉండుట గమనించితిని. దాని పాదములు ఎలుగుబంటి పాదములను పోలిఉండెను. నోరు సింహపునోటివలె ఉండెను.ఆ భయంకర సర్పము తన శక్తిని, సింహాసనమును, విస్తారమైన అధికారమును ఆ మృగమునకు ఒసగెను.

3. ఆ మృగము తలలలో ఒకటి తీవ్రముగ గాయపడి చావుదెబ్బ తగిలినట్లు ఉండెను. కాని గాయము మానిఉండెను. భువియంతయు ఆశ్చర్యముతో నిండినదై ఆ మృగమును అనుసరింపసాగెను.

4. సర్పము  తన అధికారమును ఆ మృగమునకు ఒసగుటచే ప్రజలందరు  ఆ  సర్పమును పూజించిరి.వారు ఆ మృగమును కూడ పూజించిరి. ”ఈ మృగము వంటివారు ఎవరున్నారు? దానితో పోరాడగలవారు ఎవరు?”  అని  వారు పలుకసాగిరి.

5. ఆ మృగమునకు కుత్సితపు పలుకులను, దేవదూషణములను పలుకు ఒక నోరు ఇవ్వబడెను. అది నలువది రెండు నెలలపాటు అధికారము కలిగి ఉండుటకు అనుమతింపబడెను.

6. కనుక దేవుని, ఆయన నామమును, ఆయన నివాసమును, పరలోక వాసులను దూషించుటకు అది తన నోరు తెరచెను.

7. అది పరిశుద్ధులతో, పోరాడి వారిని ఓడించుటకు కూడ అనుమతింపబడెను. ప్రతి తెగపై, జాతులపై, ప్రజలపై, భాషలపై దానికి అధికారము ఒసగబడెను.

8. భువియందు జీవించు ప్రజలు అందరును దానిని  పూజింతురు. అనగా చంపబడిన గొఱ్ఱెపిల్లయొక్క జీవ గ్రంథమున ఎవరి నామములు సృష్టికి పూర్వము వ్రాయబడలేదో అట్టివారు మాత్రమే.

9. ”కనుక వినుటకు మీకు వీనులున్నచో శ్రద్ధగా వినుడు.

10.ఎవడు చెరపట్టవలెనని నిర్ణయింప బడెనో అట్టివాడు చెరలోనికి పోవును. ఖడ్గమునకు బలిగావింపబడవలెనని ఎవడు నిర్ణయింపబడెనో అట్టి వాడు తప్పక ఖడ్గమునకు బలియగును. కాని దీని యందు పవిత్రులు సహనమును, విశ్వాసమును ప్రదర్శింపవలసి ఉన్నది.”

11. అంతట భూమిలోనుండి మరియొక జంతువు బయల్వెడలుట గమనించితిని. దానికి గొఱ్ఱెపోతు కొమ్ములవంటి రెండుకొమ్ములు ఉండెను. అది భయంకర సర్పమువలె సంభాషించెను.

12. అది మొదటి జంతువుయొక్క, సర్వాధికారమును దాని  సమక్షముననే ఉపయోగించెను. భువిని, భువిపై ఉన్న వారినందరిని, ఆ మొదటి జంతువును నమస్కరింపవలసినదిగ అది బలవంతపెట్టెను. అప్పటికి ఆ మొదటి జంతువు తీవ్రమైన గాయము నయమయ్యెను.

13. ఈ రెండవ జంతువు గొప్ప సూచనలను ప్రదర్శించెను. అది దివినుండి  భువికి అగ్నివర్షము కురిపించెను. అది అందరును చూచుచుండగనే జరిగినది.

14. ఈ మాయల ద్వారా అది భువియందలి ప్రజలందరిని మోసగించెను. అది ఆ మహిమలను మొదటి జంతువు సమక్షముననే ఒనర్చుటకు అనుమతింప బడెను. కత్తిచే గాయపరచబడియు జీవించిన ఆ మొదటి జంతువు గౌరవార్థము ఒక విగ్రహమును నిర్మింపవలసినదిగ ఈ జంతువు మానవాళికి బోధించెను.

15. ఆ మొదటి జంతువు విగ్రహములోనికి ప్రాణము ఊదుట ద్వారా, రెండవ జంతువు ఆ విగ్రహమునకు ప్రాణము పోసెను. అంతట ఆ విగ్రహము మాటలాడు శక్తిగలదై తనను పూజించుటకు ఇష్టపడని వారిని చంపగలిగి  ఉండెను.

16. చిన్న, పెద్ద, ధనిక, దరిద్ర, దాస, స్వతంత్ర మానవులందరును తమ కుడిచేతుల పైగానీ, నొసళ్ళ పైగానీ  ముద్రలు  ధరింపవలెనని ఆ జంతువు నిర్బంధించెను.

17. ఈ ముద్ర ఉన్ననే కాని ఎవడును ఏమియు కొనజాలక, అమ్మజాలక ఉండెను. ముద్ర అనగా ఆ జంతువు నామము, లేదా ఆ నామమునకు బదులైన సంఖ్య. 

18.  దీనిని అర్థము చేసికొనుటకు జ్ఞానము అవసరము. జ్ఞానము గలవాడు జంతువుయొక్క సంఖ్య అననేమియో తెలిసికొనగలడు. ఏలయన, ఆ సంఖ్య ఒక మనుష్యుని సంఖ్యయే. దాని సంఖ్య ఆరు వందల అరువదియారు.